స్వస్తిక్ న్యూస్, జాతీయం :- ఈ రోజు దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల ఫోన్లకు భారీ శబ్దంతో లేదా వైబ్రేషన్ తో కూడిన అలర్ట్ మెసేజ్లు రానున్నాయి. అయితే, ఫోన్ స్క్రీన్ పై 'ఎమర్జెన్సీ అలర్ట్' (Emergency Alert) అని చూసి, ఆ పెద్ద శబ్దం విని ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఎందుకీ మెసేజ్?.. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 'సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్' (Cell Broadcast Alert System) పనితీరును పరీక్షించనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెక్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఈ మెసేజ్ లను పంపుతోంది.
ఏ సమయంలో వస్తుంది?.. ఈ అలర్ట్ మెసేజ్ ఫోన్లకు ఏ సమయంలో వస్తుందనే దానికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సమయాన్ని వెల్లడించలేదు. ఎప్పుడైనా రావచ్చు.దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?జాతీయ విపత్తులు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాల సమయంలో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసి కీలక సమాచారాన్ని వారి ఫోన్లకు నేరుగా చేరవేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న ఒక మాక్ డ్రిల్ లాంటిది ఈ పరీక్ష.వీరికి మినహాయింపు:దేశ సరిహద్దు ప్రాంతాలతో పాటు, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఈ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి ఆయా ప్రాంతాల వారికి ఈ మెసేజ్లు రావు.