స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఉపయోగించి రాబోయే రెండేళ్లలో 5 వేల నూతన ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో సుమారు 25 నుంచి 30 గుళ్లు నిర్మించేందుకు అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఇదే విధంగా మిగతా ఆలయాలకు కూడా మాస్టర్ ప్లాన్లను త్వరితగతిన రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రణాళికల అమలు ద్వారా, ఆయా దేవాలయాలకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.