స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :-మార్కాపురం జిల్లా,త్రిపురాంతకం మండలంలో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మేడపి టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. గాలి తీవ్రతకు టోల్ గేట్కు సంబంధించిన భారీ పైకప్పు (రూఫ్) ఒక్కసారిగా లేచి అవతలి పడింది.తృటిలో తప్పిన ప్రాణాపాయంప్రమాదం జరిగిన సమయంలో టోల్ గేట్ గుండా కొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో టోల్ సిబ్బంది, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. టోల్ క్యాబిన్లలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

స్తంభించిన ట్రాఫిక్ :- భారీ ఇనుప పైకప్పు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రంగంలోకి దిగిన అధికారులు :- సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన కూలిపోయిన పైకప్పు శిథిలాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న ఇనుప గడ్డర్లను, రేకులను పక్కకు తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి ఉంచాలని అధికారులు సూచించారు.