స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత అత్యధికంగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, మరియు జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. విపరీతమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను ప్రకటించింది.
ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఎండల తీవ్రత మరింత పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఎండీ వెల్లడించింది. ఈ రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని హెచ్చరించింది.వాతావరణ నిపుణుల సలహా:పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల దృష్ట్యా వాతావరణ నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, కాబట్టి ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రయాణాలు చేసేవారు, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.