స్వస్తిక్ న్యూస్, పాలిటిక్స్ :- భారతదేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను "ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా" ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరాల ప్రకారం.. అస్సాం , కేరళ మరియు పుదుచెర్రీ రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడు లో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుండగా, వెస్ట్ బెంగాల్ లో ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.

అదేవిధంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా సుమారు 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 25 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.