స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని, వేసవి సెలవుల తర్వాతే ఈ ప్రక్రియ ఉంటుందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) శ్రీనివాస్ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేశారు.రాష్ట్రంలో బీసీ (వెనుకబడిన తరగతుల) జనగణన పూర్తి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం నిన్న విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై సర్వే జరుగుతోందని, ఇది పూర్తి కావడానికి కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సర్వే నివేదిక పూర్తయిన తర్వాత, దాన్ని బట్టి బీసీ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉన్నందున, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించబోమని, వేసవి సెలవుల్లోపు స్థానిక ఎన్నికలు ఉండవని ఆయన కోర్టుకు నివేదించారు.ప్రభుత్వ న్యాయవాది (ఏజీ) ఇచ్చిన ఈ వివరణను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏకంగా జులై నెలకు వాయిదా వేసింది. ఏజీ ప్రకటన మరియు కోర్టు వాయిదాతో ఏపీలో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికల సందడి ఉండదని స్పష్టమైంది.