స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తాజాగా కేంద్రం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపు నిర్ణయం రవాణా ఖర్చులను పెంచి, తద్వారా అనేక ఇతర రంగాలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కేవలం 10 రోజుల్లోనే ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని మోడీ ప్రభుత్వం పది రోజుల్లోనే వమ్ము చేసిందని, ఇది ముమ్మాటికీ ప్రజలను వంచించడమేనని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. సామాన్య ప్రజలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.