స్వస్తిక్ న్యూస్, మార్కాపురం :-
»వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసింది నేనే
» పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు.
» ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురానికి నీరిస్తాం.
వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. మహానాడు సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ప్రజలకు స్పష్టం చేశారు.వెలిగొండ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది తన హయాంలోనే అని, దానికి పునాది వేసింది తానేనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రాజెక్టు పనులు కనీసం ఓ కొలిక్కి రాకుండానే, పూర్తిగా పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. నిధుల కొరతను అధిగమించి, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులను పూర్తి చేసి మార్కాపురం జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు గట్టి హామీ ఇచ్చారు.