స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వర్షాల కారణంగా పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు ఈ వడగండ్ల వానలు నష్టం కలిగించడంతో రైతులకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అనూహ్యమైన వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎండల మధ్యలోనే ఇలా వర్షాలు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
