స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర చాలా ఘనంగా ముగిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కొంతమంది భక్తులు వచ్చి ఈ మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారులను దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ఏడాది ఎంతో ఘనంగా మేడారం మహా జాతరను జరిపించారు. ఈ జాతరలో సామాన్య భక్తులతో పాటు ఎంతోమంది సినిమా, రాజకీయ మరియు వ్యాపార రంగాల ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. జాతర ముగిసిన అనంతరం అమ్మవారులను వనప్రవేశం చేయించి.. అనంతరం హుండీ లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు.

గత వారం రోజులుగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ నిన్న సాయంత్రం ముగిసింది. ఆలయ అధికారులు పటిష్ట భద్రతతో ఏర్పాటు చేసినటువంటి 828 హుండీలను లెక్కించారు. ఈ ఏడాది అన్ని హుండీల లెక్కింపు పూర్తయిన అనంతరం 12,64,67,051 రూపాయల ఆదాయం లభించింది అని స్పష్టం చేశారు. అలాగే ఈ 828 హుండీల్లో దాదాపు 18 దేశాల కరెన్సీ ఉంది అని పేర్కొన్నారు.

ప్రస్తుతం నోట్లను అలాగే రూపాయి కాయిన్లను లెక్కించిన ఆలయ అధికారులు.. మరి కొద్ది రోజుల్లో బంగారం మరియు వెండి ఆభరణాలు లెక్కింపు పూర్తి చేస్తారు అని తెలిపారు. కాగా గత జాతరలో మొత్తం 13.25 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది 12.64 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది అని తెలిపారు. ఏది ఏమైనా కూడా దేశంలో జరిగే అతి పెద్ద గిరిజన జాతరలో ఇంత మొత్తంలో హుండీ ఆదాయం రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే. భక్తుల కోరికలు తీరిన లేదా భక్తుల కోరికలు నెరవేరాలని ఈ హుండీలలో వారికి తోచినంత స్వామివారికి కానుకగా సమర్పిస్తారు.

