స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ పరీక్ష పేపర్లను మూల్యాంకనం చేసే సందర్భంలో పొరపాట్లు జరగకుండా రాష్ట్ర విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై రీకౌంటింగ్ లో ఐదు మార్కులు కంటే ఎక్కువ మార్కులు తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్కు భారీ ఎత్తున ఫైన్ విధిస్తాము అని హెచ్చరించింది.

గత సంవత్సరంలో వాల్యుయేషన్ లో భారీగా తప్పులు దొర్లడం.. అంతేకాక ఒక విద్యార్థికి ఏకంగా 30 మార్కులు తేడా రావడంతో అప్పట్లో విద్యాశాఖ పై కొన్ని వివాదాలు తలెత్తాయి. దీంతో ఈసారి వాల్యుయేషన్ అనేది అప్రమత్తంగా జరగాలి అని.. ఐదు మార్కుల కంటే ఎక్కువ మార్కులు తేడా వస్తే మూల్యాంకనం చేసినటువంటి టీచర్కు 1500 రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు ఫైన్ విధిస్తాము అని హెచ్చరించింది. ఇకపోతే ఒక పేపర్ను తప్పకుండా 12 నిమిషాల పాటు దిద్దాలి అనే నిబంధనను పకడ్బందీగా అమలు చేయనున్నాము అని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ పై ప్రజల్లో నమ్మకం కలగాలని.. ఇకపై మూల్యాంకనం విషయంలో తప్పులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయి అని స్పష్టం చేసింది.