శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం జరిగిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సభలో పారిశుధ్యంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సంక్షేమం మరియు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై పలు కీలక ప్రకటనలు చేశారు
పారిశుధ్య విప్లవం - 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'
గత ప్రభుత్వం వదిలివెళ్లిన 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడమే కాకుండా, సెగ్రిరేషన్ ప్లాంట్ల ద్వారా డంపింగ్ యార్డుల సంస్కృతికి స్వస్తి పలకడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం 'స్వచ్ఛపథం', 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' వంటి ప్రత్యేక డ్రైవ్లను ప్రకటించారు. నరసన్నపేటలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సీఎం సందర్శించారు. గ్రామాల్లో పర్యావరణ హితంగా మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో 8 అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
తల్లికి వందనం సాయం పెంపు..
తల్లికి వందనం: ఈ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ. 15,000 ఆర్థిక సాయాన్ని రాబోయే రోజుల్లో మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్లు సీఎం హామీ ఇచ్చారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి - ముఖ్యమంత్రి
భూ రికార్డుల ప్రక్షాళన: గత ప్రభుత్వ హయాంలో భూముల రికార్డులలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతామని, 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ వివాదాలు లేకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
'స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే ధ్యేయం!
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే ధ్యేయమన్నారు. సమాజంలో ఉన్నత వర్గాలు పేదలను ఆదుకునేలా 'పీ4' (P4) విధానం ద్వారా 'మార్గదర్శి బంగారు కుటుంబాలు' కార్యక్రమాన్ని తెస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలను ఆపడమే లక్ష్యంగా విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టును వచ్చే జూలై (2026)లో ప్రారంభిస్తామని, పలాసలోనూ మరో ఎయిర్పోర్ట్ నిర్మించే ఆలోచన ఉందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల డెడ్లైన్లు: మద్దువలస స్టేజ్-2 , హీరమండలం ఎత్తిపోతలు , వంశధార ఫేస్-2 మొదలైన ప్రాజెక్ట్ లను 2027 జులై కల్లా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
చంద్రబాబు సంచలన నిర్ణయం: ముగ్గురు పిల్లలను కంటే రూ. 30 వేలు.. నలుగురైతే రూ. 40 వేల ప్రోత్సాహం!
భవిష్యత్తులో మానవ వనరుల కొరత రాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు సరికొత్త 'పాపులేషన్ మేనేజ్మెంట్' పాలసీని ప్రకటించారు:
ముగ్గురు పిల్లలను కంటే రూ. 30,000 నగదు ప్రోత్సాహం, నలుగురు పిల్లలను కంటే రూ. 40,000 నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు