స్వస్తిక్ న్యూస్, రాజకీయం:- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుండి తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.గత ప్రభుత్వం చేసిన అప్పులపై వస్తున్న ఆరోపణలకు జగన్ ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. తన హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ప్రస్తుత పాలనతో పోల్చుతూ కొన్ని కీలక గణాంకాలను వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో ₹3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో ₹2.73 లక్షల కోట్లను నేరుగా డీబీటీ (DBT) ద్వారా ప్రజల ఖాతాల్లోకే జమ చేశామని ఆయన స్పష్టం చేశారు. గత రెండేళ్లలో చేసిన ₹3.52 లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ చంద్రబాబు రద్దు చేశారని జగన్ ఆరోపించారు. ప్రస్తుత పాలన "దోచుకో, పంచుకో, తినుకో" అన్న చందంగా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.వచ్చే ఏడాది పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతాను. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటాను అన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెంకు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ చేసిన పాదయాత్ర ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.