స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసుకుంటూ పార్టీ పరువు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరువు తీస్తే సస్పెన్షనే.. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోనని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ గీత దాటకుండా నడుచుకోవాలని సూచించారు.
నరసరావుపేట ఎమ్మెల్యే తీరుపై అసహనం:- ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు వ్యవహరించిన తీరుపై సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనకు కావాల్సిన ఓ వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదన్న కారణంతో ఎమ్మెల్యే అరవింద బాబు రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరికీ ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ చెడ్డపేరు తీసుకొచ్చేలా ఎవరు ప్రవర్తించినా, ఎలాంటి పనులు చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.