స్వస్తిక్ న్యూస్, వైరల్ :- ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వింత ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా భార్య పకోడీలు తీసుకురమ్మని భర్తను పంపింది. అయితే భర్త పకోడీలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేసరికి భార్య అక్కడ కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ గత ఏడాది డిసెంబర్ 1న రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్ (18)ను వివాహం చేసుకున్నాడు. ఇటీవల హోలీ పండుగ సందర్భంగా రింజిమ్ తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. పండుగ అనంతరం మార్చి 9న ప్రీతమ్ అత్తగారింటికి వెళ్లి భార్యను తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఇద్దరూ బిలారి బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంతలో రింజిమ్ ఆకలిగా ఉందని చెప్పి పకోడీలు తీసుకురమ్మని ప్రీతమ్ను కోరింది. దీంతో అతను సమీపంలోని దుకాణానికి వెళ్లి పకోడీలు కొనుగోలు చేశాడు. అయితే తిరిగి వచ్చేసరికి రింజిమ్ అక్కడ కనిపించకపోవడంతో అతను బస్టాండ్ పరిసరాల్లో విస్తృతంగా వెతికినా ఫలితం లేకపోయింది.దీంతో ప్రీతమ్ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య ఒక యువకుడితో వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే రింజిమ్ మొబైల్ ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేస్తూ ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.