స్వస్తిక్ న్యూస్, ఏపీ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన భద్రతా కాన్వాయ్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల పర్యటనల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. లోకేష్ తన కాన్వాయ్ను సగానికి తగ్గించుకున్నారు. ఈ మేరకు తన భద్రతా సిబ్బందికి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన కాన్వాయ్ కేవలం 2 వాహనాలకే పరిమితం కానుంది.
జెడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ..వాస్తవానికి మంత్రి నారా లోకేష్కు భారీ భద్రత ఉంది. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ (CRPF) తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 'జెడ్' (Z) కేటగిరీ భద్రత వలయంలో ఉన్నారు. భద్రతా పరంగా ప్రోటోకాల్ ఉన్నప్పటికీ, ప్రజల సౌకర్యార్థం ఆయన తన భద్రతా వాహనాల సంఖ్యను కుదించుకోవడం గమనార్హం.
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. (నిన్న) జరిగిన ఒక పర్యటనలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మహానాడు కూడలి వద్ద పోలీసులు సాధారణ వాహనాలను ఆపేశారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్ వెంటనే అక్కడున్న పోలీసు అధికారులను పిలిపించారు. తన పర్యటన కోసం ట్రాఫిక్ను నిలిపివేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని వారికి సున్నితంగా, అయితే స్పష్టంగా సూచించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన తన కాన్వాయ్ కుదింపు నిర్ణయం తీసుకోవడం విశేషం.