స్వస్తిక్ న్యూస్, వైరల్ :- ప్రతి నెలా వచ్చే 'రెండో శనివారం' (సెకండ్ సాటర్ డే) అంటే బ్యాంకు ఉద్యోగులకే కాదు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆరోజు వచ్చే సెలవుతో వారాంతం (వీకెండ్) కాస్త పెద్దదిగా మారుతుంది. అయితే, అసలు ఏ కారణం లేకుండానే ఈ 'రెండో శనివారం' సెలవుగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక 19వ శతాబ్దపు నాటి ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది.
ఈ సెలవు వెనుక ఉన్నది ఒక చట్టమో, రాజ్యాంగపరమైన హక్కో కాదు.. ఒక కొడుకు తన తల్లిదండ్రులపై చూపించిన ప్రేమ, దానికి ఒక అధికారి స్పందించిన తీరు! 19వ శతాబ్దంలో, భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలో ఒక బ్రిటిష్ అధికారి వద్ద ఒక అసిస్టెంట్ (సహాయకుడు) పనిచేసేవాడు. అతనికి తన వృద్ధ తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. వారిని చూసేందుకు అతను కేవలం సెలవు రోజుల్లో మాత్రమే తన సొంత ఊరికి వెళ్లేవాడు.కానీ, కాలక్రమేణా పని ఒత్తిడి పెరిగి, కనీసం సెలవు రోజుల్లో కూడా ఊరికి వెళ్లడం కుదరని పరిస్థితి ఏర్పడింది. కొడుకు రాక కోసం ఎదురుచూసి అలసిపోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులే, చివరకు కొడుకును చూసేందుకు అతను పనిచేసే చోటికి వచ్చారు.
తన అసిస్టెంట్ పరిస్థితిని, అతని తల్లిదండ్రుల ఆవేదనను ఆ బ్రిటిష్ అధికారి గమనించాడు. తన సహాయకుడు ప్రతి నెలా కనీసం ఒకసారైనా సొంత ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో గడిపి రావడానికి వీలుగా, ప్రతి నెలా 'రెండో శనివారం' రోజున అతనికి సెలవును మంజూరు చేశాడు.
ఒక అధికారి మానవతా దృక్పథంతో తీసుకున్న ఆ చిన్న నిర్ణయం.. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడం, దాన్ని వారు అధికారికంగా ప్రకటించడం జరిగిపోయాయి. అలా అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి నెలా రెండో శనివారాన్ని అధికారిక సెలవుదినంగా అమలు చేయడం ప్రారంభించింది.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, భారత ప్రభుత్వం అనేక పాత చట్టాలతో పాటుగా ఈ సెలవు విధానాన్ని కూడా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అలా ఒక కొడుకు తన తల్లిదండ్రులను కలవడానికి ఆవిర్భవించిన ఈ హాలిడే.. నేడు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి శ్రమ నుంచి ఉపశమనం కలిగించే "సెకండ్ సాటర్ డే" సెలవుగా మారిపోయింది.