స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :-మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం దోర్నాలలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ మాజీ సోషల్ మీడియా కన్వీనర్ ఒద్దుల లక్ష్మిరెడ్డి, వై. పాలెం కో కన్వీనర్ మోను మాట్లాడారు. టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శిస్తూ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకల్, నాన్-లోకల్ పేరుతో ప్రజల మధ్య విభేదాలు రేపుతున్నారని ఆరోపించారు. “మేం తలచుకుంటే మీరు బయట తిరగలేరు అని మీరు అంటున్నారు... అదే మేం తలచుకుంటే మీరు కూడా బయట తిరగలేరు” అంటూ తమపై కేసులు నమోదు చేయిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని ఆరోపించారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ సీఎం జగన్పై ప్రేమతో పనిచేస్తుంటే, టీడీపీ సోషల్ మీడియా మాత్రం డబ్బుల కోసం పనిచేస్తోందని విమర్శించారు. అలాగే తమ ఎమ్మెల్యే ఎలాంటి మాఫియాలకు పాల్పడటం లేదని, పార్టీ బలోపేతం కోసం ఖర్చు చేస్తూ పనిచేస్తున్నారని తెలిపారు.మా ఎమ్మెల్యే మీలాగా మట్టి మాఫియా, మద్యం మాఫియా చేయట్లేదన్నారు. తమపై కేసులు నమోదు చేసిన పోలీసులు టీడీపీ సోషల్ మీడియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేయమని యర్రగొండపాలెం ఎస్సై చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.